Monday, August 30, 2010

త్వరలో కొత్త రకం ఆపిళ్లు

మరింత మధురం.. ఆరోగ్యకరం!
త్వరలో కొత్త రకం ఆపిళ్లు
లండన్‌: రోజుకో ఆపిల్‌ తింటే వైద్యుడి అవసరం తప్పుతుందని చెబుతుంటారు. డాక్టర్ల అవసరాన్ని మరింత ఎక్కువగా తప్పించే ఆపిల్‌ పండ్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ పండు జన్యు క్రమాన్ని ఆవిష్కరించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొనడమే ఇందుకు కారణం. 'గోల్డెన్‌ డెలీషియస్‌' రకం ఆపిల్‌ పండు జన్యు క్రమాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది. ఐదు దేశాలకు చెందిన 100 మంది పరిశోధకులు ఇందులో పాలుపంచుకున్నారు. దీనివల్ల మరింత రుచికరమైన, తియ్యటి, ఆరోగ్యవంతమైన ఆపిల్‌ పండ్ల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని వారు తెలిపారు. ఇప్పటికే ఈ పండులోని కండ రంగు, ఫ్లేవర్‌ను నియంత్రించే జన్యువులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఎర్ర రంగు కండ ఉన్న పండ్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిలో మరింత ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి ద్వారా కీళ్లు ఆరోగ్యంగా ఉంచుకోవడంతోపాటు అల్జీమర్స్‌ వంటి వ్యాధులు దరిచేరకుండా చూసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. ఆపిల్‌ జన్యుపటం ఆవిష్కారం ద్వారా శాస్త్రవేత్తలు ఆ పండు మూలాలను గుర్తించగలిగారు.

Friday, August 27, 2010

చమురుతెట్టెను తినేసిన బ్యాక్టీరియా

చమురుతెట్టెను తినేసిన బ్యాక్టీరియా
మెక్సికో తీరప్రాంతంలో అద్భుతం
బీపీ సంస్థకు అనుకోని వరం
లండన్‌: మూడునెలల క్రితం మెక్సికో తీరప్రాంతంలో (గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో) పేరుకుపోయిన భారీ చమురు తెట్టె అదృశ్యం కావటంలో బ్యాక్టీరియా సూక్ష్మక్రిములు కీలకపాత్ర వహించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. బీపీ సంస్థకు చెందిన దాదాపు 50 లక్షల బ్యారెళ్లకు సమానమైన చమురు.. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలోని సముద్రంలోకి ఒలికిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఇది అత్యంత భారీ చమురు లీకేజీగా నమోదైంది. ఈ ఘటన తర్వాత 35 కిలోమీటర్ల పొడగునా 3600 అడుగుల లోతున్న చమురు తెట్టె ఏర్పడింది. దీన్ని తొలగించటంపై బీపీ పరిశోధకులు మల్లగుల్లాలు పడ్డారు. అనేక పద్ధతులను అవలంభించారు. అయితే, వారికి 'ఒషెనోస్పిరిల్లేల్స్‌' అనే బ్యాక్టీరియా నుంచి అనుకోని సహకారం లభించింది. చమురును హరాయించుకునే సామర్థ్యమున్న ఈ బ్యాక్టీరియా క్రిములు.. తెట్టె ఏర్పడిన తర్వాత వందలకోట్ల సంఖ్యలో అక్కడ గుమిగూడి చమురును తినేయటం ప్రారంభించాయి. మూడునెలల్లో చమురు మరక అన్నది లేకుండా చేశాయి. అయితే, కొద్దిమంది నిపుణులు ఈ వాదనతో విబేధిస్తున్నారు. చమురు తెట్టె పలచనవటంవల్లో, వేరే ప్రాంతానికి తరలిపోవటంవల్లో అదృశ్యమై ఉంటుందని చెబుతున్నారు.

Thursday, August 26, 2010

భూమికి పెనుగండం రానుందా?

'1999 ఆర్‌క్యూ36' అనే భారీ గ్రహశకలం 2182లో భూమిని ఢీకొట్టనుందని,  దీని తాకిడితో తీవ్ర వినాశనం కలుగుతుందని స్పెయిన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. '1999 ఆర్‌క్యూ36' గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం వెయ్యిలో ఒక వంతు మాత్రమే అయినప్పటికీ.. ఇది 2182లోనే సంభవించే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. సుమారు 1,800 అడుగుల వ్యాసం గల ఈ శకలాన్ని 1999లో గుర్తించారు. ప్రస్తుతం సూర్యుడి వెనక ఉన్న దీనిని 2011లో మాత్రమే చూడగలం. ఇలాంటి భారీ శకలాన్ని దారి మళ్లించి భూమిని కాపాడేందుకు చేసే ఎలాంటి ప్రయత్నమైనా.. అది భూమిని ఢీకొట్టే సమయానికన్నా 100 సంవత్సరాల ముందే ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిని 2080 వరకు గుర్తించకుండా ఉన్నట్టయితే అలాంటి ప్రయత్నాలేవీ ఫలించి ఉండేవి కావని శాస్త్రవేత్తలు చెప్పారు.

తమిళనాట సిఎఫ్‌ఎల్‌ వెలుగులు



ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై కాంపాక్ట్‌ ఫ్లోరసెంట్‌ లాంప్‌లను మాత్రమే ఉపయోగించాలంటూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పాతకాలం నాటి ఇన్‌కాండెసెంట్‌ బల్బులను (గుబ్బ బల్బు) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సహకార సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సహాయం పొందుతున్న సంస్థల కార్యాలయాలలో ఉపయోగించరాదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

నాలుగు కోట్ల 60 వాట్‌ల ఇన్‌కాండెసెంట్‌ బల్బులకు బదులుగా 14 వాట్‌ల సిఎఫ్‌ఎల్‌లను ఉపయోగించటం వలన ఒక్క గంటకు 1840 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేయవచ్చునని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంటోంది. నాలుగు కోట్ల 60 వాట్‌ల ఇన్‌కాండెసెంట్‌ బల్బులను గంట సేపు వాడటం వలన 2400 మెగావాట్ల విద్యుత్‌ వ్యయం అవుతుంది. కాగా అదే సంఖ్యలో 14 వాట్ల సిఎఫ్‌ఎల్‌లను వాడటం వలన కేవలం 560 మెగావాట్‌ల విద్యుత్తు మాత్రమే ఖర్చు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Friday, August 20, 2010

గణితం ఇక ఎంతో సులభం


కేవలం ఆటలకే  కాదు చదువులో ఉపయోగపడేలా కంప్యూటర్‌ను వాడుకోవచ్చు. ఇందుకు ఎన్నో ఉచిత సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం ఉపయోగించటం నేర్చుకొవాలంతే.


కంప్యూటర్‌నే ఓ చక్కని ట్యూటర్‌గా మార్చేయ వచ్చు. పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలను సులువుగా అర్థమయ్యేరీతిలో, బొమ్మలు, గ్రాఫిక్స్‌తో మనసుకి హత్తుకునేలా బోధిస్తూనే... మెదడుకు పదును పెట్టే పజిల్స్‌, వీడియో గేమ్‌లతో ఆకట్టుకునే అద్భుతమైన సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి.

మాత్ హోం వర్క్  మేకెర్ తో కంప్యూటర్‌ని లెక్కల మాస్టర్‌గా మార్చేయవచ్చు. రకరకాల ఉదాహరణలతో ఉన్నత పాఠశాల దగ్గర్నుంచి కాలేజీల్లో చెప్పే గణిత పాఠ్యాంశాల్ని ఇది సులువుగా చెబుతుంది. రంగుల బాక్సుల్లో కనిపించే పాఠ్యాంశాల్లో నచ్చిన దానిపై క్లిక్‌ చేస్తే చాలు లెక్కలు సిద్ధం. ఉదాహరణకు  వైశాల్యం, వ్యాసార్ధం, వ్యాసం, చుట్టుకొలతలను కనుక్కోవచ్చు. సైట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ను దిగుమతి చేసుకున్నాక, తెరపైకి వచ్చే 'మాథ్స్‌ హోంవర్క్‌ మాస్టర్‌'పై డబుల్‌క్లిక్‌ చేసి రన్‌ చేయాలి. http://math-hw-maker.official.ws/

Thursday, August 19, 2010

విశ్వ దర్శనం

విశ్వం గురించి తెలుసుకోవాలంటే నగరంలోని ప్లానిటోరియం థియేటర్‌కు వెళ్లక్కర్లేదు. Asynx Planetariumతో కంప్యూటరే ప్లానిటోరియంలా మారిపోతుంది. గ్రహాల్ని, నక్షత్ర మండలాల్ని చూపిస్తుంది. మౌస్‌ మార్కర్‌ ద్వారా వివరాల్ని చూడొచ్చు. Geocentric, Helliocentric వ్యూలో విశ్వాన్ని చూడొచ్చు. నాసా చిత్రాలతో రూపొందించడం దీంట్లోని ప్రత్యేకత.

www.asynx-planetarium.కం

టైపింగ్‌ శిక్షణ!

టైప్‌బ్లాస్టర్‌ టూల్‌తో ఆడుతూ పాడుతూ టైపింగ్‌లో మీరు శిక్షణ పొందొచ్చు. అంతరిక్షంలో విమానాల్ని నడుపుతూ ముందు కనిపించే పదాల్ని టైప్‌ చేయాలి. టైప్‌ చేసిన అక్షరం వెంటనే పేలిపోతుంది. పదం పూర్తవ్వగానే స్పేస్‌బార్‌ కొట్టాలి. దీంతో మరో పదం లక్ష్యంగా మారుతుంది. ఇలా మీరు టైప్‌ చేస్తూ అక్షరాల్ని పేల్చే వేగాన్ని బట్టి స్కోర్‌ వస్తుంది.
స్కోర్‌బోర్డ్‌లో word per minute, Mistakes, Elapsed Timeలను చూడొచ్చు.

www.brothersoft. com/typeblaster-34910.html

మెదడుకు పదును

మీ పిల్లలకు వివిధ అంశాలకు సంబంధించిన పజిల్స్‌ని రూపొందించి ఇచ్చే పని కూడా పీసీకే చెప్పవచ్చు. అందుకోసం Puzzle Generator టూల్‌ ఉంది. సైట్‌ నుంచి దిగుమతి చేసుకుని వివిధ రకాల 'వర్డ్‌ పజిల్స్‌'ని రూపొందించుకోవచ్చు. ఓపెన్‌ చేయగానే Group, Title, Make Puzzle ఆప్షన్లతో విండో వస్తుంది. గ్రూప్‌లో మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని టైటిల్‌ ఎంటర్‌ చేసి మేక్‌ పజిల్‌ను క్లిక్‌ చేయండి. ఉదాహరణకు Earthని ఎంచుకుని పేరు ఎంటర్‌ చేస్తే ప్రత్యేక విండోలో పజిల్‌ ఓపెన్‌ అవుతుంది. జూమ్‌ఇన్‌ సౌకర్యంతో నచ్చినట్టుగా పజిల్‌ను చూడొచ్చు. www.canadiancontent.net/tech/download/puzzle_generator.html

ఇలా 'టైంటేబుల్‌'

పాఠశాల నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఇంట్లో ఏమేం చేయాలనే బాధ్యత కూడా పీసీకే అప్పగించండి. అందుకోసం తయారు చేసిందే ABC Timetable. దిగుమతి చేసుకుని నిక్షిప్తం చేయగానే డెస్క్‌టాప్‌పై ఐకాన్‌ వస్తుంది. టూల్‌ ఫుల్‌స్క్రీన్‌లో ఓపెన్‌ అవుతుంది.

టూల్‌బార్‌, వారం రోజులతో టేబుల్‌ వస్తుంది. టూల్‌బార్‌లోని Columns, Rowsతో నిలువు, అడ్డు వరుసల్ని పెట్టుకోవచ్చు. బాక్స్‌లో క్లిక్‌ చేసి షెడ్యూల్‌ని తయారు చేయవచ్చు. ఆకర్షణీమైన గ్రాఫిక్స్‌ని టేబుల్‌కి బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవాలంటే Select designను ఎంచుకోండి. Fontతో టేబుల్‌లో టైప్‌ చేసి టెక్ట్స్‌ నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.
ప్రింట్‌ తీసుకోవచ్చు కూడా. http://tinyurl.com/ABC-Timetable

మరికొన్ని...

*TinyPiano, http://tinyurl.com/398zolv

*Family Tree Pilot, http://family-tree-pilot.en.softonic.com

*SuperMemo, http://tinyurl.com/3ywfyl9

Wednesday, August 18, 2010

ఇండియన్‌ ఐడల్‌-5గా తెలుగుతేజం

పంద్రాగస్టు పర్వదినాన తెలుగుతేజం శ్రీరామ్‌ మహోన్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఇండియన్‌ ఐడల్‌గా ఆవిర్భవించాడు. సోనీ టీవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండియన్‌ ఐడల్‌-5 మ్యూజిక్‌ రియాలిటీ షోలో తెలుగు కుర్రాడు శ్రీరామ్‌ విజయకేతనం ఎగురవేశాడు. పోటీలు జరుగుతున్న తొలి రోజు నుంచీ శ్రావ్యమైన తన గొంతుతో శ్రీరామ్‌ అందరినీ ఆకట్టుకున్నాడు.శ్రీరామ్‌ను జడ్జీలు పొగడ్తలతో ముంచెత్తని రోజు లేదు.  విలక్షణ నటుడు అమీర్‌ఖాన్‌.... 'ఆ కిశోర్‌కుమారే' పాడుతున్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో శ్రీరామ్‌ తొలినుంచీ హాట్‌ఫేవరేట్‌గా మారిపోయాడు. అనుకున్నట్లే... ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో విజేతగా నిలిచి తెలుగువారి హృదయాలను ఆనందంతో నింపేశాడు 24 ఏళ్ల మైనంపాటి శ్రీరామచంద్ర.
ఇండియన్‌ ఐడల్‌ విజేత శ్రీరామ్‌కు సోనీటీవీ రూ.50 లక్షల నగదు బహుమతిని అందించింది. దీంతోపాటు ఒక బైక్‌, ఒక కారు కూడా ఇచ్చారు. విజేతతో ఒక సంవత్సరంపాటు సోనిటీవీతో ఒప్పందం కూడా ఉంటుంది. యాశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌లో పాట పాడే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఇండియన్‌ ఐడల్‌ కార్యక్రమాన్ని తాను సెలక్షన్స్‌ జరుగుతున్నప్పటి నుంచీ చూసినట్లు బిగ్‌బీ అమితాబ్‌ చెప్పారు. తన శ్రీమతి జయాబచ్చన్‌కు ఈ కార్యక్రమం బాగా నచ్చిందని వెల్లడించారు. అంత తేలికగా దేనినీ ఆమోదించే తత్వం ఆమెది కాదని అమితాబ్‌ మ్యూజిక్‌ రియాలిటీ షో కార్యక్రమాన్ని ఆకాశానికి ఎత్తేశారు.
ఇండియన్‌ ఐడల్‌ ఫైనల్స్‌కు వెళ్లినా... చివరి వరకూ గెలుపు ఎవరిని వరిస్తుందన్నది చెప్పడం కష్టమే. కార్యక్రమాన్ని చూసి అభిమానులు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వారికి మద్దతు ప్రకటించాలి. పాటలు పాడటంలో ఎంత ప్రతిభ ఉన్నా... సెల్‌ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశాలు రావడం కూడా ముఖ్యమే. ఇంతకుముందు ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో కారుణ్య ఫైనల్స్‌కు చేరినా ఎస్‌ఎంఎస్‌ల్లో వెనకబడిపోవడంతో ఆయన రన్నరప్‌గా నిలిచారు. ఈసారి శ్రీరామ్‌ గెలుపును కోరుకుంటూ చాలా మంది ఎస్‌ఎంఎస్‌లు పంపడం శ్రీరామ్‌కు కలిసివచ్చింది. అభిజీత్‌ సావంత్‌, సందీప్‌ ఆచార్య, ప్రశాంత్‌ తమాంగ్‌, సౌరభీలు ఇంతకుముందు ఇండియన్‌ ఐడల్స్‌గా విజయం సాధించారు. ప్రస్తుత విజేత... శ్రీరామ్‌ ఈటీవీ నిర్వహించిన 'ఒక్కరే' పోటీలో విజేతగా నిలిచాడు. ఈటీవీ 'సై' ఫైనలిస్ట్‌. బిగ్‌ఎఫ్‌ఎంలో 'వాయిస్‌ఆఫ్‌ ఆంధ్రా'గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకూ 5 తెలుగు సినిమాల్లో పాటలు పాడిన శ్రీరామ్‌ ఇంజినీరింగ్‌ చదువుకున్నాడు. సంగీతంలో ప్రవేశం ఉంది. సందీప్‌-సులేమాన్‌ కంపోజ్‌ చేసిన ఒక హిందీ సినిమాకు శ్రేయా ఘోషల్‌తో కలిసి ఒక పాట పాడారు.

Monday, August 16, 2010

సిఎంఎస్‌ వాతావరణ్‌ 2010

cms_vatavaran
హైదరాబాద్‌ సిఎంఎస్‌ వాతావరణ్‌ 2010 ఆధ్వర్యంలో 'కామన్‌వెల్త్‌ గేమ్స్‌ : 2010 లో కార్బన్‌ ఫెయిర్‌' పేరిట పర్యావరణం, వన్య ప్రాణి చిత్రోత్సవాలను హైదరాబాద్‌లో ఆగస్ట్‌లో నిర్వహించారు. శేఖర్‌ దత్తాత్రి నిర్మించిన 'ది ట్రూత్‌ ఎబౌట్‌ టైగర్‌' చిత్రాన్ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించటంతో పాటు అవార్డులను పొందిన 40 చిత్రాలను చిత్రోత్సవంలో ప్రదర్శించారు.
పృధ్వీ రత్న అవార్డు గ్రహీత శేఖర్‌ దత్తాత్రి, చిత్ర నిర్మాత గిరిశ్‌ గిరిజా జోషి, సేవ్‌ సంస్థకు చెందిన విజయ రామ కుమార్‌, సివిల్‌ సొసైటీ నాయకుడు డాక్టర్‌ రావు చెలికాని, అర్బన్‌ ప్లానర్‌ బి.ఎన్‌.రెడ్డి, పర్యావరణ వేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం రెడ్డిలను ఈ సందర్భంగా గ్రీన్‌ హీరోల పేరిట సత్కరించారు.
పర్యావరణం, వాతావరణ మార్పులు, సుస్థిర సాంకేతిక పరిజ్ఞానం, ఎకో టూరిజం వంటి పలు అంశాలపై సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఓపెన్‌ ఫోరం, ప్యానల్‌ డిస్కషన్‌లు, విద్యార్థులకు వివిధ పోటీలను ఈ సందర్భంగా నిర్వహించారు.
పెయింటింగ్, క్లే మోడలింగ్, ఫోటోగ్రఫీ వంటి పోటీలలో ఎంట్రీలను భారతీయ విద్యా భవన్ లో  ప్రదర్శించారు.  వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు.

Sunday, August 15, 2010

భారతీయ భాషల్లో తర్జుమా

ఏ భాషైనా సరే!
ఇంటర్నెట్‌లో ఇక భారతీయ భాషల్లో తర్జుమా సదుపాయం
'ఎంటీ' వ్యవస్థను అభివృద్ధి పరచిన ఐఐఐటీ-హైదరాబాద్‌
హైదరాబాద్‌: కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ వంటి సదుపాయాలు త్వరలో భారతీయులకు మరింత సులభరీతిలో చేరువ కాబోతున్నాయి. ఇంగ్లీషులో తక్కువ ప్రవేశం ఉన్నవారూ వీటిని ప్రభావశీలంగా వినియోగించుకునేందుకు అవసరమైన భారతీయ భాషల మెషిన్‌ ట్రాన్స్‌లేషన్‌ (ఎంటీ) వ్యవస్థ సిద్ధమైంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న దీనిని ఐఐఐటీ-హైదరాబాద్‌ (ఐఐఐటీ-హెచ్‌) నేతృత్వంలోని 11 విద్యాసంస్థల కన్సార్టియం అభివృద్ధి చేసింది. మొదటి దశలో ఈ వ్యవస్థ విషయాన్ని (టెక్ట్స్‌) 12 భారతీయ భాషల్లోకి స్వయంచలితంగా తర్జుమా చేసే సదుపాయాన్ని అందిస్తుంది. రెండో దశలో మరో 12 భాషల్లో ఈ అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు ఐఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌, ఆచార్యుడు రాజీవ్‌ సంగాల్‌ తెలిపారు. గూగుల్‌ సహా ఇతర సైట్లు ప్రధానంగా ఇంగ్లీషు నుంచి ఇతర అంతర్జాతీయ భాషల్లోకి మాత్రమే తర్జుమా సదుపాయాన్ని అందిస్తున్నాయన్నారు. ఎంటీ ప్రాజెక్టు భారతీయ భాషలపై దృష్టి సారించిందని ఆయన వివరించారు. తమ ఉత్పత్తిని ఆవిష్కరించిన అనంతరం ఐటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తామన్నారు. గూగుల్‌, యాహూ వంటి సంస్థలు 'ఎంటీ' కోసం తమను సంప్రదిస్తే అవసరమైన చర్చలకు సిద్ధమని డైరెక్టర్‌ ప్రకటించారు. ఈ ఉత్పత్తిపై తమకు పేటెంట్‌ హక్కులు ఉంటాయని, ఎంటీని వినియోగించుకునేవారు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.

మాయంచేసే పరిజ్ఞానం

మాయంచేసే పరిజ్ఞానం త్వరలో సాక్షాత్కారం!
పట్టుదారంతో చమత్కారం
కీలక ముందడుగు వేసిన శాస్త్రవేత్తలు
లండన్‌: పౌరాణిక సినిమాల్లో చూపించినట్లు.. ఉన్నట్లుండి మీరూ అంతర్థానమైపోవాలని అనుకుంటున్నారా? అయితే మీ కల త్వరలోనే సాకారం కాబోతోంది. ఈ దిశగా కీలక ముందడుగు వేసినట్లు బోస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు పట్టుదారంతో ఒక అద్భుత వస్త్రాన్ని తయారుచేయడంలో మంచి పురోగతి సాధించారు. దీన్ని ఏదైనా వస్తువుపై కప్పిఉంచితే.. అది కాంతి కిరణాలను పక్కకు వంచేస్తుంది. ఫలితంగా ఆ వస్తువు మన కంటికి కనిపించదు. కాంతిలో దృశ్య స్పెక్ట్రమ్‌కు వెలుపల ఉండే టెరాహెర్ట్జ్‌ రేంజ్‌ ఉండే 'మెటా మెటీరియల్‌'పై శాస్త్రవేత్తలు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు పట్టు దారానికి ఈ లక్షణాన్ని కల్పించడం చాలా కీలక విజయమని వివరించారు. మానవశరీరం ఈ దారాన్ని నిరాకరించదని తెలిపారు. అందువల్ల దీన్ని నేరుగా మానవశరీరంపై ప్రవేశపెట్టవచ్చని పరిశోధనలో పాలుపంచుకున్న ఫియోరెంజో ఒమెనెట్టో పేర్కొన్నారు. ఈ పట్టు వస్త్రంలో బంగారంతో తయారుచేసిన చిన్న పరికరాలను ఉంచుతారు. వీటిని స్ల్పిట్‌ రింగ్‌ రిజోనేటర్లని వ్యవహరిస్తారు. ప్రతి చదరపు సెంటీమీటర్‌ వస్త్రంలో 10వేల రిజోనేటర్లను ఉంచుతారు. ఇవి నిర్దేశిత పౌనఃపున్యాల్లో కాంతిని గ్రహించడమో.. పరావర్తనం చెందించడమో.. పక్కకు వంచడమో చేస్తాయి. వైద్యశాస్త్రంలో ఇది అక్కరకొస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

వీర గంధము


వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ!
పూసి పోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో !!

తెలుగు బావుట కన్ను చెదరగ
కొండవీటను నెగిరినప్పుడు
తెలుగు వారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు

తెలుగువారల వేడినెత్తురు
తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందున నున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు

ఇట్టి సందియ మెన్నడేనియు
బుట్టలేదు రవంతయున్‌
ఇట్టి ప్రశ్నల నడుగువారలు
లేకపోయిరి సుంతయున్‌

నడుముగట్టిన తెలుగు బాలుడు
వెనుక తిరుగండెన్నడున్‌
బాసయిచ్చిన తెలుగు బాలుడు
పాఱిపోవం డెన్నడున్‌

ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము మైనలందుము;
శాంతిపర్వము జదువవచ్చును
శాంతి సమరంబైన పిమ్మట

తెలుగునాటిని వీరమాతను
జేసి మాత్రము తిరిగి రమ్మిక
పలుతుపాకులు పలు ఫిరంగులు
దారి కడ్డము రాక తప్పవు

వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో !!
-- 'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి

Saturday, August 14, 2010

ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రులు

ఇక్కడ చిత్రంలో ఉన్న ప్రముఖ వ్యక్తిని  గుర్తు పట్టగలరా? మన రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా చేసారు. మరి మన ఆంద్ర ప్రదేశ్ ను ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్య మంత్రులు ఎందరు? ఇదుగో ఇక్కడ వివరాలు ఉన్నాయి మీ కోసం.
వీరందరి చిత్రాలను సేకరించండి. వారి కాలంలో జరిగిన ప్రధానమైన ఘట్టాలను  ఆ చిత్రాల కింద రాయండి.

సంఖ్య   పేరు ఆరంభముఅంతము   రాజకీయ పార్టీ
1 నీలం సంజీవరెడ్డి     1956 నవంబర్ 1   1960 జనవరి 11    కాంగ్రెసు
2  దామోదరం సంజీవయ్య1960 జనవరి 11  1962 మార్చి 29కాంగ్రెసు
3 నీలం సంజీవరెడ్డి 1962 మార్చి 291964 ఫిబ్రవరి 29కాంగ్రెసు
4 కాసు బ్రహ్మానంద రెడ్డి  1964 ఫిబ్రవరి 291971 సెప్టెంబర్ 30 కాంగ్రెసు
5పి.వి.నరసింహారావు1971 సెప్టెంబర్ 30 1973 జనవరి 10 కాంగ్రెసు
6రాష్ట్రపతి పాలన1973 జనవరి 101973 డిసెంబర్ 10
7జలగం వెంగళరావు1973 డిసెంబర్ 101978 మార్చి 6 కాంగ్రెసు
8డా.మర్రి చెన్నారెడ్డి 1978 మార్చి 6 1980 అక్టోబర్ 11కాంగ్రెసు-ఐ
9టంగుటూరి అంజయ్య1980 అక్టోబర్ 111982 ఫిబ్రవరి 24కాంగ్రెసు-ఐ
10భవనం వెంకట్రామ్1982 ఫిబ్రవరి 241982 సెప్టెంబర్ 20కాంగ్రెసు-ఐ
11 కోట్ల విజయభాస్కరరెడ్డి1982 సెప్టెంబరు 201983 జనవరి 9కాంగ్రెసు-ఐ
12నందమూరి తారక రామారావు   1983 జనవరి 9  1984 ఆగష్టు 16తెలుగుదేశం
13నాదెండ్ల భాస్కరరావు1984 ఆగష్టు 161984 సెప్టెంబర్ 16కాంగ్రేసు
14నందమూరి తారక రామారావు1984 సెప్టెంబర్ 161985 మార్చి 9తెలుగుదేశం
15నందమూరి తారక రామారావు   1985 మార్చి 9 1989 డిసెంబర్ 3 తెలుగుదేశం
16డా.మర్రి చెన్నారెడ్డి1989 డిసెంబర్ 31990 డిసెంబర్ 17 కాంగ్రేసు
17నేదురుమిల్లి జనార్ధనరెడ్డి1990 డిసెంబర్ 171992 అక్టోబర్ 9 కాంగ్రేసు
18 కోట్ల విజయభాస్కరరెడ్డి  1992 అక్టోబర్ 91994 డిసెంబర్ 12 కాంగ్రేసు
19నందమూరి తారక రామారావు     1994 డిసెంబర్ 121995 సెప్టెంబర్ 1  తెలుగుదేశం
20  నారా చంద్రబాబునాయుడు 1995 సెప్టెంబర్‌ 1  2004 మే 14 తెలుగుదేశం
21వై.యస్.రాజశేఖరరెడ్డి2004 మే 142009 సెప్టెంబర్ 2కాంగ్రేసు
22కొణిజేటి రోశయ్య   2009 సెప్టెంబర్ 3 కాంగ్రేసు

తెలుగు సంవత్సరాలు


మీకు తెలుగు సంవత్సరాల పేర్లు తెలుసా? ఇపుడు నడుస్తున్న సంవత్సరం పేరు ఏమిటో మీరు చెప్పగలరా? తెలియకపోతే ఒకసారి మీ ఇంటిలో అమ్మానాన్న వాళ్ళను అడిగి చూడండి.

తెలుగు సంవత్సరాల పేర్లు మొత్తం అరవై ఉన్నాయి.

1. ప్రభవ

2. విభవ

3. శుక్ల

4. ప్రమోదూత

5. ప్రజోత్పత్తి

6.అంగీరస

7. శ్రీముఖ

8. భావ

9. యువ

10. ధాత

11. ఈశ్వర

12. బహుధాన్య

13. ప్రమాది

14. విక్రమ

15. వృష

16. చిత్రభాను

17. స్వభాను

18. తారణ

19. పార్ధివ

20. వ్యయ
21.సర్వజిత్తు

22. సర్వధారి

23. విరోధి

24. వికృతి

25. ఖర

26. నందన

27. విజయ

28. జయ

29. మన్మథ

30. దుర్ముఖి

31. హేవిళంబి

32. విళంబి

33. వికారి

34. శార్వరి

35. ప్లవ

36. శుభకృతు

37. శోభకృతు

38. క్రోధి

39. విశ్వావసు

40. పరాభవ
41.ప్లవంగ

42. కీలక

43. సౌమ్య

44. సాధారణ

45. విరోధికృతు

46. పరీధావి

47. ప్రమాదీచ

48. ఆనంద

49. రాక్షస

50. నల

51. పింగళ

52. కాలయుక్త

53. సిద్ధార్ధి

54. రౌద్రి

55. దుర్మతి

56. దుందుభి

57. రుధిరోద్గారి

58. రక్తాక్షి

59. క్రోధన

60. అక్షయ

అతి కోపంతో గుండెకు పోటే!

కోపం, అసహనం ఎక్కువగా ఉండే వ్యక్తులకు గుండె ఆగిపోవడం, గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువని హెచ్చరిస్తున్నారు అమెరికా పరిశోధకులు. ''తన కోపమే తన శత్రువు'' అని మన వాళ్ళు కూడా ఏనాడో చెప్పారు. తాజాగా అమెరికా పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఇటలీలోని నాలుగు గ్రామాల్లో 5,614 మందిపై అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అతి కోపం, అసహనం ఎక్కువగా ఉండేవారిలో కెరోటిడ్‌ రక్తనాళాలు మందంగా మారిపోవడంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఏంజెలీనా సుటిన్‌ తెలిపారు. ఇతరులతో ఎక్కువగా పోటీపడటంతో పాటు స్వప్రయోజనాల కోసం ఘర్షణపడే వ్యక్తుల్లో ధమనులు మందంగా మారతాయని, వారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువని ఆమె వెల్లడించారు.
మరి దీని నుంచి మనం ఏం నేర్చుకొందాం? కాస్త ప్రశాంతంగా ఉండటం నేర్చుకొందాం. ఆనందంగా ఉండటం నేర్చుకొందాం. 

పండ్లను మగ్గబెట్టేందుకు ఇథలీన్‌


పచ్చి కాయలను త్వరగా పళ్ళలా మార్చేందుకు వాటిని గడ్డిలోనో, గాలి సోకని గదుల్లోనో మగ్గబెట్టటం మనకు తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో రకరకాల రసాయనాలను ఉపయోగించటం పెరుగుతోంది. 
వివిధ రకాల పండ్లను కాల్షియం కార్బైడ్‌తో మగ్గబెట్టడం వల్ల కలిగే ఆరోగ్య అనర్థాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న కాల్షియం కార్బైడ్‌ స్థానే ఇథలీన్‌ను ఉపయోగించడం సురక్షితమని భావిస్తున్నారు. ప్రమాణాల రూప కల్పనకు జాతీయ ఉద్యాన బోర్డు ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు భారత వ్యవసాయ పరిశోధన మండలి తెలిపింది. వివిధ రకాల పండ్లను ఏయే ఉష్ణోగ్రతల్లో ఎంత మేర ఇథలీన్‌ ఉపయోగించి మగ్గబెట్టాలనేదానిపై కమిటీ కసరత్తు చేస్తోండిపుడు. 

Friday, August 13, 2010

నేస్తం

'చెలిమి' అనే మాటకు అర్థం మీకు తెలుసునుగా! స్నేహం, దోస్తి, మైత్రి అనే మాటలు కూడా అదే అర్థమిస్తాయి. స్నేహం అంటే ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉండడం. ఎప్పుడూ కలిసి మెలసి ఆడుకోవాలనీ, ఒకరికి కష్టం వస్తే మరొకరు సాయం చేయాలనీ అనుకోవడం - అది స్నేహం యొక్క అంతరార్థం.
అలాంటి గాఢ స్నేహితులను గురించి చిన్న కథ చెబుతాను. రమణ, రవి ఎంతో మంచి స్నేహితులు, ఇద్దరూ ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఉంటున్నారు. చిన్నప్పటినుంచి ఒకే బడిలో చడువుకుంటున్నారు. కలిసి బడికి వెళ్ళి పక్కపక్కనే కూర్చునేవారు. ఇద్దరికి మంచి మార్కులే వచ్చేవి.
ఒకరోజు బడి దగ్గర ఉన్న చెరువు గట్టున కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. రమణా, రవీ బడికి వెళుతూ వాళ్ళని చూశారు.
'ఒరేయ్‌! చిన్న పిల్లలు నీళ్ళ దగ్గరికి వెడితే ప్రమాదం. వెళ్ళి పొమ్మని చెపుదాం.'' అని అన్నాడు రమణ రవితో.
''పోరా! మనకెందుకు మనం చెపితే వాళ్ళు వింటారా? పద పద, బడికి వేళయిపోతూంది.'' అన్నాడు రవి.
సరే, వీళ్ళు నాలుగడుగులు వేశారో లేదో పిల్లలు గొల్లున గోల చేయడం వినిపించింది. ఎవరో చిన్న పిల్ల నీళ్ళలో కాలు జారి పడనే పడింది. రవి, రమణ వెనక్కి పరిగెత్తుకొచ్చారు. రవి చప్పున చొక్కా విప్పి నీళ్ళలో దూకాడు. నీళ్ళల్లో పడిన పిల్ల కాళ్ళు తేలిపోతుండగా చెరువులోకి జారిపోతూంది. రవి ఆ పిల్ల గౌెను పట్టుకుని ఒడ్డుకు లాక్కుని వచ్చాడు.
ఆ పాప భయంతో వణికిపోతూంది. పెద్దవాళ్ళు కొందరు ఈ గొడవ విని గబగబా వచ్చారు. పిల్లని ఎత్తుకుని గట్టు మీద కూర్చో బెట్టారు. కళ్ళు తెరిచి దిక్కులు చూస్తున్నది. పాప తండ్రికి ఈ విషయం తెలిసింది. ఆయన అక్కడికి వచ్చాడు. తన బిడ్డను రక్షించినందుకు రవిని మెచ్చుకున్నాడు. రవి అమ్మానాన్న  కూడా జరిగింది విని పాపకు, రవికి కూడా ప్రమాదం తప్పినందుకు సంతోషించారు.
ఇదంతా పూర్తయి బడికి కొంచెం ఆలస్యంగా చేరారు మిత్రులిద్దరూ. అప్పటికే రవి చేసిన సాహసకార్యం అందరికీ తెలిసిపోయింది. ఆ సాయంత్రం ప్రత్యేకంగా ఒక మీటింగ్‌ పెట్టారు. పాప తల్లిదండ్రులు రవికి బహుమతిగా నూరు రూపాయలు ఇచ్చారు. హెడ్మాస్టరు ప్రశంసాపత్రం బహుకరించారు. సభ పూర్తి అయ్యే సమయానికి రమణ తను కూడా ఒక్క నిమిషం మాట్లాడతానని అనుమతి కోరాడు.
''పెద్దలందరికీ వందనాలు. రవి సాహసవంతుడు. మంచివాడు. కానీ అవసరం అయినపుడు మాట్లాడడు. ముందు చూపులేదు. అది ఒక్కటే లోపం.'' అనేసి వెళ్ళి కూర్చున్నాడు. ఈ మాటలకు పిల్లలు పెద్దలు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రవికి అంత గౌరవం జరిగినందుకు ఈర్షతో ఇలా మాట్టాడాడు అనుకున్నారు.హెడ్మాస్టరు రమణని వేదిక మీదికి పిలిచి-
''అందరు రవిని మెచ్చుకుంటూ ఉంటే నువ్వు అలా అనడం ఏమీ బాగుండలేదు రమణా! ఇందుకు ఏదో కారణం ఉండాలి. ఏమిటిది?'' అన్నారు. రమణ ఉదయం తామిద్దరు చెరువు దగ్గర నడుస్తున్నప్పుడు జరిగిని సంభాషణ చెప్పాడు.
''ముందుగానే ఆ పిల్లల్ని దూరంగా పంపి ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు'' అన్నాడు రమణ. సభలో ఉన్న వారందరు నిజమే అని అంగీకరించారు. పాప తండ్రి మాట్లాడటానికి లేచి నిలబడటంతో అందరూ నిశ్శబ్బమై పోయారు.
''రమణ, రవికి నిజమైన స్నేహితుడు. ఎందుకంటే అందరూ రవిని మెచ్చుకున్నాగానీ, మిత్రునిలోని లోపాన్ని చెప్పి సరిదిద్దుకోమని హెచ్చరించిన రమణ, రవి మేలుకోరినవాడు. రవి ఇంకా పైకి రావాలన్న అభిమానంతో ఆ చిన్నలోపం కూడా లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. మిత్రుడంటే ఎప్పుడూ ప్రేమగా ఉండేవాడు మాత్రమే కాదు. లోపాలను కూడా ఎత్తిచూపి మంచి మార్గం చూపేవాడు కూడా. అయితే రమణ తానైనా కనీసం ఆ పిల్లలను నీటి వద్దకు పోవద్దని చెప్పవలసింది. ఏది ఏమైనా పాపకి తప్పిన ప్రమాదానికి నాకు సంతోషంగా ఉంది. రవి, రమణల చెలిమి మరింత పెరగాలని ఆశీర్వదిస్తున్నాను అన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు.
-- తురగా జానకీరాణి.

వెల్లుల్లితో రక్తపోటు నియంత్రణ



ధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి మిశ్రమం దివ్యౌషధమని తేలింది. డాక్టర్‌ కారిన్‌ రీడ్‌ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అయితే ముడి లేదా ఉడికించిన వెల్లుల్లి, వెల్లుల్లి పొడి మాత్రం అంత ప్రభావం చూపదని పరిశోధకులు అంటు న్నారు. నిల్వ ఉంచిన వెల్లుల్లి  ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. వెల్లుల్లి నైట్రిక్‌ ఆక్సైడ్‌(ఎన్‌వో), హైడ్రోజన్‌ సల్ఫేడ్‌ లాంటి రసాయనాల విడుదలకు దోహదపడుతుంది. దీనిద్వారా రక్తనాళాలు ఉపశమనం పొందుతాయి. తద్వారా అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

Saturday, August 7, 2010

తేనెటీగ దారి మర్చిపోతోంది!

తేనెటీగ దారి మర్చిపోతోంది!
సెల్‌ టవర్ల ప్రభావం?
తగ్గుతున్న జీసీసీ తేనె సేకరణ
ధురమైన అంశాన్ని చెప్పాలంటే తేనెతో పోలుస్తాం. తెలుగును తేనెలూరే భాషగా వర్ణిస్తాం. బరువు తగ్గాలంటే పరగడుపునే గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలుపుకోవాలని నిపుణులు సలహా ఇస్తారు. బలవర్ధకమైన, రుచికరమైన ఆహార పదార్థంగానే కాకుండా సబ్బుల వంటి సౌందర్య సాధనాల ఉత్పత్తిలో కూడా తేనెను వినియోగిస్తారు. అటువంటి తేనె.. క్రమంగా అరుదైపోతోంది.
క్క గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అమ్మకాల నిమిత్తమే ఏడాదికి 3,000 క్వింటాళ్ల వరకు తేనె అవసరం అవుతుంది. కానీ, గత ఆర్థిక సంవత్సరంలో అతి కష్టం మీద 1,800 క్వింటాళ్లు మాత్రమే సేకరించగలిగారు. తేనె సేకరణ పడిపోవడానికి అడవుల విస్తీర్ణం, వర్షాల తగ్గుదల వంటివే కాకుండా సెల్‌ టవర్లు, సెల్‌ సిగ్నళ్లు కూడా కారణమని చెప్తున్నారు. 'తేనెటీగలు చాలా సున్నితమైనవి. కష్టజీవులు కూడా. ఒక్కో ఈగ తన స్వల్ప జీవిత కాలంలో దాదాపు లక్ష వరకు పువ్వులపై వాలి మకరందాన్ని సేకరించి తేనెపట్టుకు చేరుస్తుంది. పువ్వులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటి నుంచి తేనెను పీల్చి, మళ్లీ తాము ఎక్కడ పట్టుపెట్టాయో అక్కడకు వెళ్లడానికి వాటికి ఒక మార్గం ఉంటుంది. సెల్‌ఫోన్ల టవర్లు, వాటి నుంచి వచ్చే రేడియో ధార్మికత కారణంగా తేనెటీగల మెదడు ప్రభావితమై అవి తమ ఇళ్లకు వెళ్లే మార్గాన్ని మరిచిపోతున్నాయి. పిల్ల ఈగలైతే వృద్ధి చెందకుండా మరణిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ నిపుణులు కూడా ఇటీవల తమ పరిశీలనలో తేల్చార'ని జీసీసీ ప్రధాన కార్యాలయం ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్‌డీ) ఎస్‌.రాధాకృష్ణ వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం అన్ని ప్రాంతాల్లో విస్తారంగా ఉండడం కూడా తేనెటీగలు మకరందాన్ని సేకరించలేకపోవడానికి మరొక కారణమని ఆయన అంటున్నారు.

సెల్‌ఫోన్‌ హాని చేస్తుందా?

బ్రాండెడ్‌ సెల్‌ఫోన్లతో అయినా అన్‌బ్రాండెడ్‌ మొబైల్‌తో అయినా 5 నిమిషాలు మాట్లాడినా చెవి దగ్గర వేడెక్కితే , ఫోన్‌ నుంచి అధిక రేడియేషన్‌ వెలువడటమే కారణం. అందుకే సెల్‌ఫోన్‌ కొనేటప్పుడు ఫీచర్లతో పాటు రేడియేషన్‌ ఎంత వెలువరిస్తుందో కూడా తెలుసుకోవాలి. 
మొబైల్‌ ఫోన్‌ రేడియో తరంగాలను ప్రసారం చేయడంతో పాటు గ్రహిస్తుంది కూడా. అందుకే ఫోన్‌ నిర్దిష్ట శోషణ సూచి (ఎస్‌ఏఆర్‌) అంటే రేడియో తరంగాల నుంచి ఎంత శక్తిని మన శరీరం గ్రహిస్తుందో కూడా తెలుసుకోవాలి.
'కిలోగ్రాముకు 2 వాట్ల కంటే తక్కువ రేడియేషన్‌ వెలువరించేవి మంచి ఫోన్లు' అని స్వతంత్ర సాంకేతిక సంస్థ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ నాన్‌ అయొనైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ (ఐసీఎన్‌ఐఆర్‌పీ) తేల్చింది. 10 గ్రాముల కణజాలాన్ని సగటుగా తీసుకుని లెక్కించారు. దీనినే అంతర్జాతీయంగా అనుసరిస్తున్నారు. అయితే చెవి దగ్గర ఫోన్‌ ఉంచి మాట్లాడేందుకు ఎస్‌ఎఆర్‌ 1.29 వాట్లు/కిలోగ్రామ్‌ ఉండాలని ఐసీఎన్‌ఐఆర్‌పీ నిర్దేశించింది.
ఎస్‌ఏఆర్‌ పరిమాణం నిర్ధరించిన అత్యధిక విలువ కంటే తక్కువే ఉండాలి. ఎందుకంటే నెట్‌వర్క్‌ను చేరేందుకు మాత్రమే సెల్‌ఫోన్‌ తన బ్యాటరీ నుంచి శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. నెట్‌వర్క్‌ బేస్‌ స్టేషన్‌ నుంచి మనం ఎంత దూరాన ఉన్నాం అనే అంశంపై సెల్‌ఫోన్‌ శక్తి వినియోగం ఆధారపడుతుంది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి  * ఎస్‌ఏఆర్‌ తక్కువగా ఉండే సెల్‌ఫోన్లు కొనాలి. * సాధ్యమైన చోట్ల ఫోన్‌ చెవి దగ్గరకు చేర్చకుండా, స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడాలి * హెడ్‌సెట్‌ (ఇయర్‌ఫోన్లు) వినియోగించినా సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ప్రభావం పూర్తిగా పోదు * అవసరమైన కాల్స్‌ మాత్రమే మాట్లాడి, మిగిలిన వాటికి టెక్ట్స్‌ మెసేజ్‌ (ఎస్‌ఎంఎస్‌) వినియోగించాలి * సెల్‌ఫోన్‌ తీసుకెళ్లేటప్పుడు మన శరీరానికి కనీసం అంగుళం దూరాన ఉండేలా చూసుకోవాలి * నెట్‌వర్క్‌ బలహీనంగా ఉన్నచోట, సిగ్నల్‌ కోసం ఫోన్లు అత్యధిక రేడియేషన్‌ను వెలువరించే అవకాశముంది. అలాంటి ప్రదేశాల్లో ఫోన్‌ వినియోగం తగ్గించాలి * నిద్రించేటప్పుడు తలగడ వద్ద ఫోన్‌ ఆన్‌చేసి ఉంచవద్దు.

అబ్రకం పొరల్లో జీవం ఆవిర్భావం!

అబ్రకం పొరల్లో జీవం ఆవిర్భావం!
అమెరికా శాస్త్రవేత్తల సరికొత్త సిద్ధాంతం
వాషింగ్టన్‌: జీవం ఎక్కడ మొదలైంది? శతాబ్దాలుగా మనిషిని తొలుస్తున్న ఈ ప్రశ్నకు కొత్త సమాధానం దొరికింది. అబ్రకం ఫలకాల్లో జీవం ఆవిర్భవించిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు సూత్రీకరించారు. పుస్తకంలోని పేజీల తరహాలో ఉండే ఈ ఖనిజం పొరల్లో మొదటి జీవి వూపిరి పోసుకుందని వివరించారు. ఈ పొరల మధ్య కంపార్ట్‌మెంట్లు ఉండేవని పేర్కొన్నారు. వీటిలో కొన్ని పరమాణువులు కణాలుగా మారడానికి అవసరమైన భౌతిక, రసాయన వాతావరణాన్ని అబ్రకం కల్పించిందని తెలిపారు. ''జీవం ఏర్పడడానికేకాదు.. దాని మనుగడకు ఈ ఖనిజ ఉపరితలం అనువైన పరిస్థితులను కల్పించింది'' అని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన హన్సమా చెప్పారు.

Wednesday, August 4, 2010

మంచిపని

''రాణక్కా! రోజూ ఒక మంచిపనయినా చెయ్యాలని మా టీచరు చెప్పారు.'' అన్నాను పాలుతాగుతూ.
''ఒక ముసలతన్ని రోడ్డు దాటించిన పిల్లాడి కథను మీ టీచర్‌ ముందుగా చెప్పారు కదా!'' అని అడిగింది రాణక్క. అక్కకి పాలలో మీగడ గొంతు దిగదు. అందుకే పాలమీద తేలిన మీగడను తీసేయటంలో మునిగి ఉంది.
''నీకెలా తెలుసు?'' ఆశ్చర్యంగా అడిగాను.
''మా టీచర్‌ కూడా చెప్పారులే. ఒక మంచి పని చేసి, దాని గురించి రాసి చూపించ మన్నారు.''
''అయితే ఈ రోజే ఇప్పుడే, మొదలు పెడదామా'' పాలు తాగేసి ఉత్సాహంగా అన్నాను.
'ఊ' అంటూ ఒప్పుకుంది రాణక్క.
''నేను కూడా మంచి పనులు చేస్తాను'' అంటూ చిట్టి తమ్ముడు రాము తయారయ్యాడు.
అయ్యో! వీడి ముందు చెప్పకుండా ఉంటే బాగుండేది! ఇప్పుడు తుమ్మబంకలా పట్టుకుని వదలడు. మనం ఎక్కడికెళితే అక్కడికి తోక లాగా వస్తాడు. మనం ఏది చెయ్యబోతే అది తనూ చెయ్యాలంటాడు'' నాకు చాలా కోపం వచ్చేసింది.
రాము రెండవ తరగతి చదువుతున్నాడు.'' వాళ్ళ టీచరు మంచి పనులు చెయ్యమని చెప్పలేదాయె. వాడేమో చిన్నవాడు, మేమేమొ పెద్దవాళ్ళం. రోడ్డును మా అంతట మేము దాటగలం. వాడు దాటలేడు. మరి రోడ్డును దాటడానికి ముసలివాళ్ళకు ఎలా సహాయ పడగలడు?''
ఇదంతా వివరించి నచ్చచెప్పాలని చూశాం. కాని వింటే కదా! మంచిగా చెబితే ఎప్పుడూ అర్థం చేసుకోడు. మా వెంటనే తిరగటం మొదలు పెట్టాడు. ఎవరికైనా రోడ్డు దాటటంలో సహాయ పడటంతో మంచి పనులు మొదలు పెడదామనుకున్నాం. కాని ఎంత సేపున్నా రోడ్డు దాటడానికి ఒక ముసలావిడగానీ, ముసలాయన గానీ రాలేదు. విసుగొచ్చి ఇంటికి వెళదామనుకుంటుండగా ఒక పెద్ద మనిషి కనపడ్డాడు. మరీ అంత ముసలాయన కాదు. రోడ్డు దాటాలను కున్నట్లే ఉన్నాడు.
మేము పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాం. రావద్దని చెప్పేలోగా రాము మా వెనక పడి రానే వచ్చాడు. అతని దగ్గరకు వెళ్ళి నిలుచోగానే మా వైపు తేరిపార చూడసాగాడు. రోడ్డు దాటించమని అడగటానికి తటపటాయిస్తున్నాడేమో అనిపించింది.
''రోడ్డు దాటబోతున్నారా?'' రాణి అడిగింది.
'ఊ' అని విసురుగా బదులిచ్చి, మరో మాట మాట్లాడకుండా రాము చెయ్యీ గభాలున దొరకపుచ్చుకుని రోడ్డు దాటసాగాడు. రాణి మా వెనుకనే వస్తోంది. మేము అతనికి సహాయ పడేదిపోయి అతనే మాకు సహాయపడుతున్నాడని నాకు అర్థమైంది. నేను రాణివైపు చూశాను. అక్క నవ్వుతోంది. నేను కూడా నవ్వు ఆపుకోలేకపోయాను. ఇద్దరం ఒక్కసారే పెద్దగా నవ్వేశాం. ఏం జరుగుతుందో అతను గ్రహించే లోపునే మా చేతులను వదిలించుకుని ఇంటికేసి పరుగుతీశాం. దారిపొడుగునా నవ్వుతూనే ఉన్నాం. అలా నవ్వుతూ మా ఇంటి తోటలోని కొలను దగ్గరికి వచ్చాం.
''నీటిలో పడిన పురుగుల్ని రక్షిద్దామా'' రాణి అడిగింది. 'ఇదయినా మంచి పనే కదా!' అని మునుగుతున్న పురుగుల కోసం వెదికా. కాని ఆ క్షణంలో నీటిలో మునుగుతున్న పురుగులేవి లేవు. రాము కూడా మాతో చేరి వెదకసాగాడు. వాడు నీటి మీదికి మరీ వంగి ఉండటం చూసి -
''ఓరే రాము! నీటిలో పడతావు. నువ్వు ఇంట్లోకి పో'' అని కసురుకున్నాను.
రాము కొంచెం వెనక్కి జరిగాడు కాని ఇంట్లోకి వెళ్ళలేదు. అక్కని పురుగుల కోసం వెతకమని చెప్పి నేను రాము చెయ్యి పట్టుకుని ఇంట్లోకి ఈడ్చుకు వెళ్ళాను. వాడు ఎంతగా తన్నుకున్నా, అరుస్తున్నా లక్ష్యపెట్టలేదు. అమ్మ దగ్గరికి తీసికెళ్ళి తమ్ముడు విసిగిస్తున్నాడని చెప్పాను. కాని అమ్మ తమ్ముడిని ఏమీ అనకుండా నన్నే కోప్పడింది.
నేను అలిగి ఒక మూల కూర్చున్నాను. రాము నన్ను మాట్లాడించాలని, బ్రతిమాలు కోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. నేను మాత్రం మూతి బిగించి, ముఖం ముడుచుకుని అలాగే కూర్చున్నాను.
అంతలోనే తోటలోంచి అక్క అరుపులు వినపడ్డాయి. ''మణీ! తొందరగా రావే. నీటిలో రెండు చీమలు పడ్డాయి.''
నా అలకా, విచారం మరిచిపోయి తోటలోకి పరిగెత్తాను. ఇద్దరం కొలను పక్కకు చేరాం. నీటిలో రెండు ఎర్ర చీమలు పడి కొట్టు కుంటున్నాయి. నేను రెండు ఎండిన ఆకులు ఏరి ఒకటి రాణికి ఇచ్చాను. అక్క చీమ పక్కగా ఆకును ముంచి మెల్లిగా పైకి తీసింది. చీమ ఆ ఆకును పట్టుకుని బయటకు వచ్చింది. నేను కూడా అలాగే చేశాను. ఇద్దరం ఆకులను నేలమీద పెట్టాం. నీటిలో తడిసిన చీమలు నీళ్ళు వదిలించుకుని, మీసాలు సవరించుకుంటుంటే ఊపిరి తీసుకోవటం కూడా మరిచి చూడసాగాం. ఒకటి రెండు నిమిషాల తర్వాత చీమలు ఒళ్ళు సవరించుకుని కదిలాయి.
''చూడండి! నేను కూడా ఒక చీమను రక్షించాను.'' అంటూ రాము అరిచాడు. వాడి చేతిలో ఉన్న ఆకు మీద తడిసిన చీమ ఒకటి నీళ్ళు వదిలించుకుంటూంది.

''ముందు నువ్వు చీమని నీళ్ళల్లో పడేశావు కదూ?'' రాణి కోపంగా అడిగింది.
రాము ఏం మాట్లడలేదు కానీ వాడే చీమని నీటిలో పడేసి రక్షించాడని తెలిసిపోతోంది.
''చీమని రక్షించి మంచి పనిచేశావు. కాని ముందుగా దానిని నీటిలో పడెయ్యటం వల్ల దానికెంతో బాధ కలిగించావు. కాబట్టి నువ్వు చేసిన మంచి పనికి ఉపయోగం లేదు.'' అని రాణక్క చెప్పింది.
ఒక నిమిషం పాటు రాము తలవంచుకొని ఏమి మాట్లాడలేదు. తరువాత తలెత్తి మా వైపు సూటిగా చూస్తూ ''మీ మాటేమిటి? మీరు నన్ను ఎన్నోసార్లు బాధ పెట్టారు. నన్ను మీతో ఆడుకోనివ్వరు. ఎప్పుడూ తిడుతుంటారు. మీరు చేసే మంచి పనుల వల్ల ఏమైనా ఉపయోగముంటుందా?' అని అన్నాడు.
మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. ఇక నుంచి రాముతో మంచిగా ఉండాలనుకున్నాం.
''ఈ చీమల్ని ఇక్కడే వదిలేస్తే ఎవరైనా తొక్కేస్తారు. వీటిని గోడ దగ్గర వదిలిపెడదామా?'' అన్నాను.
రాణి తలూపి తన ఆకును పట్టుకుంది. ముగ్గురం ఆకుల్ని పట్టుకొని గోడ దగ్గరకు తీసుకెళ్ళి వదిలిపెట్టాం. మూడు చీమలు వరుసలో గోడ ఎక్కుతుంటే ముగ్గురం చూడసాగాం.
--- అనిల్‌ ఎక్‌బోటే
అనువాదం:సురేష్‌
(బాల రచయితల వర్క్‌షాప్‌ సౌజన్యంతో)

కోతుల తెలివి

అది ఒక చిన్న ఊరు! ఆ ఊరి పేరు కొండపాక!!
ఆ ఊర్లో రాజయ్య అనే ఒక బాలుడు ఉండేవాడు. ఆ ఊరికి చాలా దూరంలో ఒక అడవి ఉంది. ఊర్లోని చాలామంది అడవికి వెళ్ళి పళ్ళు, కట్టెలు తెచ్చుకునేవారు. ఒకరోజు రాజయ్య అడవికి వెళ్ళి పండ్లు తెచ్చుకుందామని ఒక సంచి తీసుకుని అడవికి బయలుదేరాడు. పండ్లు అన్నీ చెట్ల చివరన ఉండటం వలన కోసుకోవటానికి వీలుకాలేదు. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒకచెట్టు కిందికి వచ్చి సంచీ పక్కన పెట్టుకుని పడుకున్నాడు. కాసేపటికి బాగా నిద్రపట్టింది. కొంతసేపటికి కోతులగుంపు ఒకటి అటుగా వెళ్తూ చెట్టుకింద పడుకున్న రాజయ్యను చూశాయి. అతని పక్కన ఉన్న ఖాళీ సంచిని చూసి ఒక కోతి ఇలా అంది-
''పాపం అడవిలో పండ్ల కోసం వచ్చినట్లున్నాడు. మనం అతనికి సహాయం చేద్దాం'' అంది. అన్ని కోతులూ కూడా 'సరే' అని చెట్లపై ఉన్న పండ్లను కోసి రాజయ్య సంచి నింపాయి.
''అతను నీరసంగా ఉన్నట్లున్నాడు. మనమందరం కలిసి అతన్నీ మోసుకుపోయి అతని ఊరి పొలిమేరల్లో వదిలేద్దాం'' అని ఇంకో కోతి అంది.
కోతులన్నీ అందుకు ఒప్పుకుని రాజయ్యను జాగ్రత్తగా మోసుకుంటూ అతని ఊరి పొలిమేరల్లో వదిలిపెట్టి, నిండుగా ఉన్న పండ్ల సంచీని అతడి పక్కన పెట్టాయి. కొద్దిసేపటికి రాజయ్యకు మెలుకువ వచ్చింది. తను ఊరి పొలిమేరల్లో ఉండటం, తన సంచి పండ్లతో నిండి ఉండటంచూసి ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశాడు. దూరంగా వెళ్తున్న కోతుల గుంపును చూసి అవే తనను ఇక్కడ వదిలిపెట్టాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.
సంతోషంగా తన ఊరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఊర్లో అందరూ వింతగా చెప్పుకోవడం ప్రారంభించారు. అది విని సోమయ్య అనే ఒక సోమరిపోతు తను కూడా అలా వెళితే కోతులు తన సంచీనిండా పండ్లు నింపుతాయనే దురాశతో ఒక పెద్ద సంచి తీసుకుని అడవికి బయలు దేరాడు.
        అడవిలో ఒక చెట్టు కింద సంచి తన పక్కన పెట్టుకుని పడుకున్నట్లుగా నటించాడు, కోతులు ఎప్పుడు వస్తాయా! అని ఆలోచిస్తూ. కాసేపటికి కోతుల గుంపు చెట్టు కింద పడుకున్న సోమయ్యను చూశాయి.
కోతులన్నీ పండ్లు తెంపి సంచిలో వేసి సోమయ్యను మోసుకుంటూ ఊరి పొలిమేర వైపు వెళ్ళసాగాయి. నిద్ర నటిస్తున్న సోమయ్య కోతులు తన సంచీని పళ్ళతో నింపాయో లేదో గమనించడానికి ఒక కన్ను తెరిచాడు. ఒక పిల్ల కోతి ఈ విషయాన్ని గమనించి మిగతా కోతులకు చెప్పింది. వెంటనే అవి సోమయ్య మోసంతో తమ సహాయం తీసుకుంటున్నాడని తెలుసుకున్నాయి.
సోమయ్యను దబ్బున కింద పడేసి పండ్ల సంచితో సహా పారిపోయాయి.
'దురాశ దుఃఖమునకు చేటు' అనుకుంటూ, సంచిపోవడమే గాక, నడుం విరిగినందుకు బాధపడుతూ ఊరివైపు బయలు దేరాడు సోమరిపోతు సోమయ్య.

Tuesday, August 3, 2010

సెల్‌ఫోన్లు - బ్యాక్టీరియా పుట్టలు!

సెల్‌ఫోన్ల మీద హానికారక సూక్ష్మజీవులు కూడా ఉంటాయని మీకు తెలుసా? అది కూడా మీ బాత్రూమ్‌లోని ఫ్లష్‌ హ్యాండిల్‌ మీద ఉండే బ్యాక్టీరియా కన్నా సగటున 18 రెట్లు ఎక్కువంటే నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని చెబుతున్నారు బ్రిటన్‌ పరిశోధకులు. ప్రస్తుతం వాడకంలో ఉన్నవాటిల్లో నాలుగోవంతు సెల్‌ఫోన్లు బాగా మురికిపట్టినవేనని తాజా అధ్యయనంలో వెల్లడి అయింది.  అధ్యయనం కోసం తీసుకున్న ఫోన్లల్లో అన్నింటికన్నా మురికిపట్టిన దాని మీద మన పెద్దపేగుల్లో కనిపించే బ్యాక్టీరియాతో పాటు సాల్మోనెల్లా వంటి క్రిముల స్థాయి ఏకంగా 39 రెట్లు అధికంగా ఉంది కూడా. ఆహారాన్ని కలుషితం చేసే బ్యాక్టీరియా సైతం ఎక్కువగానే ఉంటోంది. ''సెల్‌ఫోన్‌ను చేత్తో పట్టుకున్నప్పుడు దాని నుంచి అంటుకున్న బ్యాక్టీరియా వృద్ధి చెంది, తిరిగి ఫోన్‌ మీదికి చేరుతోంది. ఇలా పెరిగి పెరిగి చివరికి అనారోగ్యానికి కారణమవుతోంది'' అని పరిశోధకులు వివరించారు. ఇలాంటి సూక్ష్మక్రిములతో తీవ్రమైన కడుపునొప్పి వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మనకు బ్యాక్టీరియా ఎంత తేలికగా అంటుకుంటోందనటానికి ఈ సెల్‌ఫోన్లే మంచి ఉదాహరణ.

మనుషుల్ని అనుకరించే రోబో

జపాన్ శాస్త్రజ్ఞులు మనుషుల్ని అనుకరించే రోబోను తయారు చేసారు. ఒక వ్యక్తి మాటలు, కదలికలను వీడియోలో చూసి ఉన్నదున్నట్లుగా మళ్లీ చేసి చూపించగల రోబోను వారు తయారు చేశారు. టెలినాయిడ్ ఆర్1 అనే ఈ రోబో దూరంలో ఉన్న మన సహచరులను దగ్గరగా ఉన్న భావనను కలిగిస్తుందని  పరిశోధకులు చెబుతున్నారు. మన పక్కనుండే టెలినాయిడ్ ఆర్1కు దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తి మాటలు, కదలికలు ఒక సెన్సర్ ద్వారా అందుతాయి. అది అచ్చు గుద్దినట్లు వాటిని అనుకరించి చూపుతుంది. నిజ జీవితంలో వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని పరిశోధకుల అంచనా. ఇది చూడ్డానికి అచ్చు మనిషి లాగే ఉంటుంది. అలాగే ఆడ, మగ, చిన్న పెద్దా వయసున్న వారిలాగా కూడా కనపడే విధంగా ఈ రోబోను తయారు చేయొచ్చు.

ఏడాది కరెంటు బిల్లు 16 కోట్లకు పైనే

మీ ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది నెలకు? సాధారణంగా మధ్య తరగతి ఇంటి కరెంట్ బిల్లు నెలకు మూడు నుంచి నాలుగు వందలు ఉంటుంది. మరి రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, కార్యాలయాల్లో ఏటా విద్యుత్ వినియోగానికి ఎంత వెచ్చిస్తున్నారో తెలుసా? అక్షరాలా రూ. 16 కోట్లకు పైనే. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైన సమాచారమిది. ప్రధాని, రాష్ట్రపతి నివాసాలు, కార్యాలయాల్లో విద్యుత్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారనే సమాచారం కావాలంటూ ముంబైకి చెందిన చేతన్ కొఠారి అనే ఆర్టీఐ ఉద్యమ కార్యకర్త అడిగారు. గత నాలుగేళ్లుగా ఇందుకు సంబంధించిన లెక్కలను తెలపాలని కోరారు.
2009కి ప్రధాని నివాసం, పీఎంవో, రాష్ట్రపతి భవన్‌లో విద్యుత్ వినియోగానికి ఖర్చయిన మొత్తం రూ. 16.33 కోట్లుగా వెల్లడయ్యింది. అయితే, 2008 కన్నా ఇది 2 కోట్లు ఎక్కువని తెలిసింది. ఒక్క రాష్ట్రపతి భవన్‌లోనే 2009లో కరెంట్ కోసం 6.67 కోట్లు, పార్లమెంటు భవనం ఆవరణలో 8.9 కోట్లు వెచ్చించారు. 2008లో సుప్రీంకోర్టులో 2.47 కోట్లు, 2009లో 2.18 కోట్లు విద్యుత్ కోసం చెల్లించారు.

Monday, August 2, 2010

సముద్రాలూ కలుషితమవుతున్నాయి

అగ్ని పర్వతాలు బద్ధలు కావటం, భూకంపాలు రావటం, సునామీ తీర ప్రాంతాలను ముంచెత్తటం వంటి ప్రకృతి ఉత్పాతాల గురించి మనం వింటూనే ఉన్నాం. మరి మనిషి చేసే పనుల వలన ఇంతే తీవ్రత ఉన్న ఎన్నో ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. సముద్రాల లోనికి మనం కావాలనో, ప్రమదావశాత్తూనో చమురును వదలటం ఇటువంటిదే.  సముద్రంలో చమురు తెట్టలుతెట్టలుగా పైన పేరుకొంటే మనకేమవుతుంది? అని అందరూ అనుకొంటూ ఉంటారు. కాని ఇది వాస్తవం కాదు. ఒక్కసారి చమురు సముద్రపు నీటిలోకి చేరితే అది నీటి పైన పొరలాగా వ్యాప్తి చెందుతుంది. గాలి వీచే దిక్కుకు అనుగుణంగా ఈ చమురు పొర కూడా విస్తరిస్తుంది. దాంతో పైనుంచి పడే కాంతి తగ్గిపోయి, నీటి లోపల ఉండే వృక్ష జాతులలో కిరణ జన్య సంయోగ క్రియ జరగటం తగ్గుతుంది. నీటిలో నివసించే జంతుజాతులలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. వాటి ఆహారంపైన ఈ చమురు పేరుకు ఉంటుంది కనుక వాటి జీర్ణ వ్యవస్థకూ ఇబ్బంది తప్పదు. జంతువుల శరీరంపైన చమురు పేరుకుని కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అలాగే పక్షుల రెక్కలు, ఈకలలో నూనె చేరి అవి తగిన విధంగా ఎగరలేక పోతాయి. సముద్రం మధ్యలో పడిన చమురు అతి తక్కువ కాలంలోనే తీర ప్రాంతాలకు కొట్టుకువచ్చి తీర ప్రాంతాలూ కలుషితమవుతాయి.
భూమి మీద పడిన చమురు వాన నీటితో పాటు కొట్టుకు పోయి సముద్రాలలో కలవటం, భూమి పొరల్లోకి ఇంకి సముద్ర జలాల్లో కలవటం, సముద్రయానం ద్వారా చమురును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ నీటిలో కలవటం వంటివి సముద్ర జలాల కాలుష్యానికి కారణంగా నిలుస్తున్నాయి.
ఒకసారి సముద్రం లోకి చమురు చేరిన తర్వాత, దానిని శుభ్రపర్చటం ఎంతో కష్టం. కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించటం, చమురును సముద్రం మధ్యలోనే తగలబెట్టటం, కలుషితమైన నీటిని సేకరించి ప్రత్యేక విధానాల ద్వారా వడబోయటం వంటి పద్ధతులు ఉన్నప్పటికీ, ఎంతో కొంత హాని మాత్రం అప్పటికి జరిగిపోయే ఉంటుంది.

రూ.2 కోట్లకు అమ్ముడైన చిన్నారి చిత్తరువులు

జీవితాన్ని కాసేపు మరిపింపజేయడానికే కళలు ఉన్నాయి.  అలాంటి కళతో పసిప్రాయంలోనే ప్రపంచ చిత్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నాడు బ్రిటన్‌కు చెందిన ఏడేళ్ల కిరోన్‌ విలియంసన్‌. తాజాగా ఈ బాలుదు గీసిన చిత్రాలు రెండు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. కేవలం అరగంట వ్యవధిలోనే మొత్తం 33 చిత్రాలను అభిమానులు సొంతం చేసుకోవడం విశేషం. అతడి చిత్రాలను కొనుగోలు చేసేందుకు  ఇంకా ఎందరో వెయిటింగ్ లిస్టు లో ఉన్నారట. తీర ప్రాంతాలు, ప్రముఖ కట్టడాల సౌందర్యాన్ని చిత్రాలుగా తీర్చిదిద్దడంలో కిరోన్‌ది అందెవేసిన చెయ్యి. ''సాధారణంగా వీలైనంత త్వరగా నిద్ర లేస్తా. చిత్రాలు గీసిన తర్వాత బడికి  వెళ్తా.సెలవు రోజు మాత్రం రోజంతా చిత్రకళపైనే దృష్టిపెడతా'' అని కిరోన్‌ చెప్పాడు.

చెత్త ఏరుకునే బాలిక నెట్‌ అందాలరాశి

నెట్‌ అందాలరాశి చెత్త ఏరుకునే టిబెట్‌ బాలిక
బీజింగ్‌: షాంఘై ఎగుమతి కేంద్రం వద్ద చెత్త ఏరుకొనే ఓ టిబెట్‌ అమ్మాయి ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో అత్యంత అందమైన బాలిక. నమ్మలేకపోతున్నారు కదూ.. చైనా ఇంటర్‌నెట్‌ ఫోరం నిర్వహించిన ఓ సర్వేలో టిబెట్‌కు చెందిన 15 ఏళ్ల అమ్మాయికి ఈ గౌరవం దక్కింది. ''అత్యంత అందమైన అమ్మాయి ఎవరు?'' అంటూ అడిగిన ప్రశ్నకు నెటిజన్లు ఇచ్చిన సమాధానమే ద్రోల్మా ఛూట్సో అని 'చైనా డెయిలీ' సోమవారం వెల్లడించింది. ఈ బాలిక అక్కడ తాగి పారేసిన శీతల పానీయాల సీసాలు, డబ్బాలు ఏరుకొని బతుకుతోంది. అక్కడ ఉండే వందలాది మంది బాలికల్లో నెటిజన్లు ఆమెనే అందమైన అమ్మాయిగా గుర్తించారు. ఈ తీర్పును గౌరవిస్తూ ''చూశారా పట్టణ జీవితాన్ని ఆ అమ్మాయి ఏ విధంగా అందంగా మార్చిందో..'' అంటూ ఇంటర్‌నెట్‌ ఫోరం వ్యాఖ్యానించింది.

ఒత్తిడిని చిత్తు చేసే టీకా!

ఒత్తిడికి ఉపశమనం కోసం గుప్పెడేసి మాత్రలు మింగక్కర్లేదని చెబుతున్నారు పరిశోధకులు. .. యోగా, ధ్యానాలతో అంతకన్నా పనిలేదని చెబుతున్నారు పరిశోధకులు. తాము అభివృద్ధి చేసే టీకా ఒత్తిడికి దివ్యౌషధమని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. 30 ఏళ్లుగా శ్రమించి ప్రపంచంలోనే తొలిసారిగా ఒత్తిడి నిరోధక టీకాను తయారుచేస్తున్నామని చెప్పారు. ఈ టీకా ఒక్క మోతాదుతో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. దీర్ఘకాలంగా ఒత్తిడికి గురవుతున్నవారు మధుమేహం, గుండెజబ్బుల బారిన పడుతున్నారని హెచ్చరించారు. ఇలాంటివారికి ప్రత్యేక ఉపశమన థెరపీలు, మాత్రలు అవసరం లేకుండా జన్యు సాంకేతిక విధానంలో ఈ టీకాను రూపొందిస్తున్నట్లు స్టాన్‌ఫర్డ్‌ న్యూరోసైన్స్‌ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ సపోల్‌స్కై వివరించారు.

అమ్మమ్మ ఐడియా

 బుజ్జిగాడికి అయిదేళ్ళు. గారాబం వల్ల మొండితనం వచ్చింది. అమ్మ చెప్పిన మాట వినడు. స్నానం చేయడానికి రోజూ మారాం చేసేవాడు. మరి  అమ్మమ్మ ఐడియా బుజ్జిలో ఏమైనా మార్పు తీసుకు వచ్చిందా? చొక్కాపు వెంకట రమణ కథనానికి గంగాధర్ బొమ్మలతో ఈ కామిక్ ని చదవండి.
 

హన్ని - బిక్కీ

హన్ని మగ కోతి. పేరుకు తగ్గట్టుగానే దీనివన్నీ కోతి బుద్ధులు. ఎప్పుడూ ఎదుటి వారిని ఏడిపిస్తుంది. వాళ్లు బాధ పడుతుంటే తను సంతోషిస్తుంది. బిక్కి అనే ఆడ కోతి ఎక్కడి నుండో ఒక అరటి పండు సంపాదించుకొని తినబోతుంటే, దాన్ని లాక్కొని ఏడిపించాలని చూసింది. అప్పుడేమయిందంటే... .. తర్వాత కథ బొమ్మలు చూస్తే మీకే తెలుస్తుంది.

పాప తెలివి

పాప తెలివి
రచన: చొక్కాపు వెంకట రమణ
బొమ్మలు: గంగాధర్

Sunday, August 1, 2010

వారసత్వ సంపదగా జైపూర్‌ జంతర్‌ మంతర్‌

పింక్‌ సిటీ జైపూర్‌ లోని జంతర్‌ మంతర్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. బ్రెసీలియాలో సమావేశమైన యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన 28వ కట్టడం జంతర్‌ మంతర్‌. 1727-34 మధ్య కాలంలో మహారాజా జైసింగ్‌-2 దీన్ని నిర్మించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏడు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఈ గుర్తింపు నిచ్చింది. దీనితో జైపూర్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. 

స్వయంగా బ్రేకులు వేసుకునే కారు

రోడ్డుమీద కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నపుడు ఉన్నట్టుండి రోడ్డుకు అడ్డంగా ఎవరైనా వస్తే, బ్రేకు వేయడం కష్టం కదూ. ఇలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు ఇకముందు లేకుండా చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ప్రత్యెక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. కారుకు అడ్డంగా వస్తువులు గానీ, మనుషులు గానీ వస్తే రాడార్లు, సోనార్ సెన్సర్ల సాయంతో గుర్తుపట్టి,  వెంటనే తనంతట తానే బ్రేకులు వేస్తుంది. ఆటో మొబైల్ వాహనాలు అన్నింటికి ఈ సదుపాయం అందుబాటు లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు కనుమరుగు అవుతాయని భావించవచ్చు.

ఎర్ర జెండా